సిద్ధరామయ్య చేతికి కులగణన నివేదిక.. కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు

  • సీఎంకు కులగణన నివేదికను సమర్పించిన వెనుకబడిన తరగతుల కమిషన్
  • లీకైన వివరాల ప్రకారం రాష్ట్రంలో ముస్లిం జనాభానే అత్యధికం
  • వీరశైవ లింగాయత్, ఒక్కలిగ వర్గాల కంటే ముస్లింల జనాభా ఎక్కువని వెల్లడి
  • రిజర్వేషన్ల విధానంపై ఈ నివేదిక ప్రభావం చూపనున్నట్లు అంచనా
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు (గురువారం) రాజీనామా చేస్తారనే ఊహాగానాలు ముమ్మరంగా సాగుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయగల కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంతోకాలంగా వివాదాస్పదంగా ఉన్న 'కుల గణన' నివేదికను సిద్ధరామయ్య బుధవారం అధికారికంగా స్వీకరించారు. కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ రూపొందించిన 'సామాజిక, విద్యా సర్వే నివేదిక'ను విధాన సౌధలోని సీఎం కార్యాలయంలో కమిషన్ చైర్మన్ మధుసూదన్ ఆర్.నాయక్ ముఖ్యమంత్రికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శివరాజ్ తంగడగి, హెచ్.సి. మహదేవప్ప, సతీశ్ జార్కిహోళి, ఎన్. చలువరాయస్వామి తదితరులు పాల్గొన్నారు. 300 పేజీల ఈ నివేదికను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా రూపొందించామని కమిషన్ చైర్మన్ తెలిపారు. అయితే, నివేదికలోని వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు.

లీకైన వివరాలతో సంచలనం
నివేదిక అధికారికంగా బయటకు రాకముందే, కొన్ని కీలక వివరాలు విశ్వసనీయ వర్గాల ద్వారా లీకయ్యాయి. ఈ సమాచారం ప్రకారం కర్ణాటక జనాభాలో ముస్లింలు 14 శాతంతో (75-80 లక్షలు) అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచారు. ఆ తర్వాత వీరశైవ-లింగాయత్‌లు 11 శాతం (60-65 లక్షలు), ఒక్కలిగలు 10 శాతం (55-60 లక్షలు), కురుబలు 8 శాతంతో (40-45 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికను ప్రభుత్వం త్వరలోనే ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఈ నివేదిక కర్ణాటక రిజర్వేషన్ల విధానంలో, రాజకీయ సమీకరణాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Siddaramaiah
Karnataka caste census
Karnataka politics
Social and Educational Survey Report
Madhusudan R Naik
Karnataka Backward Classes Commission
Muslim population Karnataka
Lingayat population Karnataka
Vokkaliga population Karnataka
Kuruba po

More Telugu News